ఏపీలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని రాజ్భవన్గా మార్చేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై సర్కార్ ఆదేశాలతో సీఆర్డియే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.నవ్యాంధ్రప్రదేశ్ గవర్నర్ అధికారిక కార్యాలయం నివాసం కోసం విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీస్ను ఎంపిక చేసే విషయాన్ని రాష్ట్రప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ పరిపాలనను ఏపీ నుంచే సాగించాలనుకున్నప్పుడు అందుకు వీలుగా విజయవాడ లో ఈ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ఏర్పాటైన తర్వాత అక్కడికి వెళ్లిపోయారు. నరసింహన్ ఉమ్మడి గవర్నర్గా పనిచేస్తూ హైదరాబాద్లోనే ఉంటూ అవసరమైనప్పుడల్లా విజయవాడకు వచ్చి వెళుతున్నారు. ఇక్కడకు వచ్చినప్పుడు గవర్నర్ ప్రైవేట్ హోటల్లో బస చేస్తున్నారు. అయితే త్వరలోనే ఏపీకి గవర్నర్ను నియమిస్తారన్న వార్తల నేపథ్యంలో విజయవాడలో గవర్నర్ కార్యాలయం, నివాసాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.