శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలకనేతలు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులుగా ముద్రపడిన గుడ్ల మోహన్, శ్రీశైలం దేవస్థానం డైరెక్టర్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాకర్ల రాజారావులు శనివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మాట్లాడిన ఇరువురు.. ఉత్తరాంధ్రను పరిపాలన రాజధానిగా వ్యతిరేకిస్తున్న టీడీపీకి భవిష్యత్ ఉండదన్నారు. ఇక్కడి టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అని ప్రభుత్వం మొత్తుకొని చెబుతుంటే ఇక్కడి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని టీడీపీ.. బురద చల్లడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. తాము త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆశీస్సులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరుతామని వారు చెప్పారు. కాగా గత ఎన్నికల్లో కూన రవికుమార్ కు ఈ ఇద్దరు నేతలు కీలకంగా వ్యవహరించారు. కొంతకాలంగా రవికుమార్ వ్యవహారశైలి కారణంగా పార్టీకి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం ఉంది. అయితే అది పార్టీ మార్పునకు దారి తీయడంతో చర్చనీయాంశయంగా మారింది.