లాక్డౌన్ వేళ.. టీటీడీ కీలక నిర్ణయం.. ఈ రోజు నుంచే అమలు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి అన్నప్రసాద వితరణను టీటీడీ నిలిపివేయనుంది. లాక్డౌన్ నేపథ్యంలో మార్చ్ 28 నుంచి తిరుపతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పేదలకు ప్రతి రోజు రెండు పూటలా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా రోజూ లక్షాన్నర మందికి ఆకలి తీరుస్తూ వచ్చింది. శనివారం వరకు 40 లక్షల 60వేల ప్యాకెట్లను అందించినట్లు టీడీపీ వెల్లడించింది.
లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో రైతులు, కూలీలు పనులు చేసుకునే అవకాశం ఉంది. దీంతో శనివారం వరకు మాత్రమే అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఆదివారం నుంచి అన్నప్రసాద వితరణ నుంచి ఉండదని అన్నదానం డిప్యూటీ ఈవో నాగరాజు కూడా స్పష్టం చేశారు. కూలీలకు, యాచకులకు ఎలాంటి ఇబ్బంది లేదని కమిషనర్ గిరీష తెలిపారు. తిరుపతిలో లాక్డౌన్ విషయంలో ఎలాంటి సడలింపుల్లేవని ప్రకటించారు.
లాక్ డౌన్ సమయంలో పేదలు, వలస కూలీలు ఆకలితో అలమటించ కూడదని టీటీడీ భారీ విరాళం ప్రకటించింది. జిల్లాకు కోటి రూపాయల చొప్పున విరాళంగా అందించింది. పేదలు, వలస కార్మికులు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదని, వారి ఆకలి తీర్చాలని టిటిడి నిధులను వినియోగించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.