TTD: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మళ్ళీ చిరుత పులి సంచారం..

TTD: 56వ మలుపు వద్ద వాహనదారులకు కనిపించిన చిరుతపులి

Update: 2023-07-13 02:06 GMT

TTD: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మళ్ళీ చిరుత పులి సంచారం..

TTD: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత అలజడి కలకలంరేపింది. తిరుమల అలిపిరి నడక దారిలో చిరుత ఓ చిన్నారిపై దాడి చేసి గాయపరిచిన ఘటన మరువక ముందే మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్‌లోని 56వ మలుపు వద్ద భక్తులకు చిరుత కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అటవీశాఖ, విజిలెన్స్ అధికారులు జీఎన్సీ వద్ద వాహనదారులను గుంపుగా పంపిస్తున్నారు. చిరుతను దారి మళ్లించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కొండ, శిరీష దంపతులు కుమారుడు కౌశిక్ తో కలిసి కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు బయలుదేరారు. వీరు మొదటి ఘాట్ రోడ్డులోని ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలో కూర్చుని ఆహారం తీసుకుంటుండగా.. పక్కనే ఆడుకుంటున్న బాలుడిని చిరుతపులి పట్టుకెళ్లింది. శ్రీవారి భక్తులు, భద్రతా సిబ్బంది వెంబడించడంతో ఆ బాలుడిని ప్రాణాలతో వదిలిపెట్టింది. అదే చిరుతను అటవీశాఖ అధికారులు బంధించి బాకరాపేట అడవుల్లో వదిలిపెట్టారు. తాజాగా ఘాట్ రోడ్డులో చిరుత కన్పించి అలజడి రేపింది.

ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత పులి.. చిన్నారి తలను నోటకరచుకుని అడవిలోకి తీసుకుపోయింది. అక్కడే ఉన్న దుకాణదారులు, బాలుడి తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ పులి వెనుక పరుగులు తీశారు. టార్చ్ లైట్లు వేస్తూ రాళ్లు విసురుతూ కేకలు వేయడంతో భయాందోళనకు గురైన చిరుత.. పోలీస్ రిపీటర్ వద్ద బాలుడిని విడిచిపెట్టేసింది. బాలుడి చెవి వెనుక, తలపై మరికొన్ని చోట్ల చిరుత పంటి గాట్లు పడ్డాయి. ఈ ప్రమాదం నుంచి కౌశిక్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత అటవీ సిబ్బంది చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరోసారి చిరుత కనిపించడంతో మళ్లీ ఆందోళన మొదలైంది.

Tags:    

Similar News