పోలవరం ప్రాజెక్టుపై ఈరోజు రాజ్యసభలో ఆసక్తికర చర్చ జరిగింది. వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి పోలవరం అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపించే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. పోలవరానికి నిధుల కేటాయింపు పై కూడా అయన అడిగారు. నిధుల విడుదల కోసం అంచనాలను ఆర్థికశాఖకు పంపకుండా... రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీకి పంపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎస్టిమేట్స్ కమిటీ ఎప్పుడు ఆమోదం తెలుపుతుందని అడిగారు.
విజయసాయి ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకున్నట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని ఆయన తెలిపారు. అందువల్ల సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఇప్పటి వరకు 60 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని... వంద శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని తెలిపారు.
కాగా, వైసీపీ మొదట్నుంచీ.. పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటుచేసుకుందని పదే, పదే ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.