ఎన్నికలకు ముందే కృష్ణా జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. మంత్రి దేవినేని నియోజకవర్గం అయిన మైలవరంలో వివాదాలు చెలరేగుతున్నాయి. మైలవరం వైసీపీ ఇంచార్జ్ వసంత కృష్ణ ప్రసాద్ తరఫున ఆయన అనుచరుడుగా చెబుతున్న మాగంటి వెంకట రామారావు నియోజకవర్గ పరిధిలోని ఎస్సైలకు డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి. తమకు లంచం ఇచ్చేందుకు వెంకట రామారావు ప్రయత్నించారంటూ మైలవరం, జీకొండూరు ఎస్సైలు శ్రీనివాసరావు, ఎండీ అష్ఫక్ బుధవారం ఫిర్యాదు చేశారు. రానున్న ఎన్నికల్లో కృష్ణ ప్రసాద్కు అనుకూలంగా వ్యవహరించాలని రామారావు కోరినట్టు ఎస్సైలు చెబుతున్నారు.
ఇందుకుగాను ఆయన డబ్బులు పంపారని, వాటిని అందించేందుకు కలుస్తానని ఆయన చెప్పినట్టు ఎస్సై చెబుతున్నారు. అయితే వసంత కృష్ణప్రసాద్ మాత్రం మంత్రి దేవినేని ఉమ చేతుల్లో పోలీసులు పావులుగా మారారని విమర్శిస్తున్నారు. దేవినేని ఉమా ఒత్తిళ్ల కారణంగానే ఇలా ఎస్సై తమపై తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారని కౌంటర్ ఇస్తున్నారాయన. మైలవరం సీఐ అక్రమ కేసులపై డీఎస్పీకి ఫిర్యాదు చేశామనే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కృష్ణప్రసాద్.. తామ ఏ పోలీస్ అధికారికి డబ్బు కవర్లతో ప్రలోభపెట్టలేదన్నారు. దమ్ముంటే సిసి పుటేజీని బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు.