ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు కమలం గూటికి చేరడంతో టీడీపీ శిబిరంలో కలవరం మొదలైంది. కాగా మరోవైపు త్వరలోనే భారీ ఎత్తున టీడీపీ నుంచి చేరికలు ఉండబోతున్నాయంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత హీట్ ఎక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీకి ఏలూరులో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అంబికా రాజధాని ఢిల్లీకి కూడా చేరుకున్నారు. ఢిల్లీలో బీజేపీ నేత రామ్ మాధవ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థంపుచ్చుకొనున్నట్లు సమాచారం. అంబికా కృష్ణతోపాటూ ఆయన సోదరుడు అంబికా రాజా కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు.
కాగా ఇటివలే ముగిసిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం 23సీట్లతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక టీడీపీ పనైపోయిందని భావిస్తున్న అంబికా కృష్ణ అందుకే బీజేపీ గూటికి చేరుతున్నారని సమాచారం. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎఫ్ డీ సీ ఛైర్మెన్గా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎఫ్డిసీ ఛైర్మెన్ పదవికి అంబికా కృష్ణ రాజీనామా చేశారు. మొత్తానికి ఒక్కోక్కరిగా టీడీపీని వీడుతుండంతో బీజేపీ చెబుతున్నట్లు ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ చాలా జోరుగా సాగుతోందనే ప్రచారం జరుగుతోంది.