కరోనా కట్టడిపై ప్రభుత్వం శ్రద్ధపెట్టడం లేదు.. అందుకే మూడో దశకు
ఏపీలో కరోనా స్వల్పకాలంలోనే మూడో దశకు చేరిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు.
ఏపీలో కరోనా స్వల్పకాలంలోనే మూడో దశకు చేరిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు.మొదటి దశలోనే కరోనా నియంత్రించి ఉంటే ఈ ప్రమాదం వాటిల్లేది కాదని నిపుణులు చెబుతున్నారని ఏపీ సీఎం జగన్కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
కరోనా వైరస్ నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంశ్రద్ద పెట్టకుండా రాజకీయ ప్రయోజనాలపైనే దృష్టిపెట్టడం భావ్యం కాదని చంద్రబాబు హితవు పలికారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా కరోనా తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. బాధ్యాతయుతంగా నిర్ణయాలు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ వారిని నిందించడం సరికాదన్నారు.
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా.... సరైన నిర్ణయాలు సత్వరమే తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా విపత్తు దృష్ట్యా లాక్ డౌన్ పొడిగించాలని కోరారు. విశాఖ మెడ్టెక్ జోన్పై పూర్తి శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలని సూచించారు. కరోనా బాధితులకు సేవలందిస్తూ మరణించిన ఫ్రంట్లైన్ వారియర్లకు కేంద్రం 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రకటించిందని, దానితో పాటు కరోనా సోకి మరణించిన కుటుంబాలకు 25లక్షల రూపాలయల ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఒక వైపు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగతున్నప్పటికీ అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు, ఇసుక, మట్టిని రవాణా చేస్తున్నారని విమర్శించారు. మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అధికారులు ప్రేక్షపాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో ఆర్-5 జోన్ ఏర్పాటుపై సర్వే చేయడం తగదని పేర్కొన్నారు.
టీడీపీ పొలిట్ బ్యూరో తీర్మానించిన 15అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. యూనివర్సిటీల పాలకమండళ్ల నియామకంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించడం సరికాదని చంద్రబాబు అన్నారు.