ఏపీ అసెంబ్లీ రెండోరోజు సమావేశాలు కాసేపట్లో ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ స్పీకర్గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. స్పీకర్ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికను లాంఛనంగా ప్రకటించారు. ప్రొటెం స్పీకర్ శంబంగి చిన్న వెంకటఅప్పలనాయుడు గురువారం ఉదయం సభాపతి తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. తమ్మినేని సీతారాంకు సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. బీసీ సామాజికవర్గానికి చెందిన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో మూడుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం తమ్మినేని సీతారాంకు ఉంది.