ఆంధ్రప్రదేశ్ ను అకాల వర్షం కుదిపేసింది. అసలే కరోనా వైరస్ వ్యాప్తితో ఇక్కట్లతో ఉన్న ప్రజలకు ఈ అకాల వర్షం మరింత ఇబ్బందికరంగా మారింది. గాలి వానల బీభత్సానికి చేతికి అందివచ్చిన పంటలు నష్టపోయారు రైతులు. అకస్మాత్తుగా గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఏపీ లో భారీ వర్షం. గాలులతో వాతావరణం మారిపోయింది. దీంతో దెబ్బకు కోతకు వచ్చిన వరి,మామిడి, కళ్లాల్లోని మిర్చి, మొక్కజొన్న, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
కర్నూలు జిల్లలో అధిక వర్షపాతం నమోదు కాగా, వర్షాలతో నెల్లూరు జిల్లాలో అధిక నష్టం ఏర్పడింది. ఇక్కడ పిడుగుపాటుకు ఏడుగురు చనిపోయారు. ఈదురుగాలుల బీభత్సానికి కొన్ని జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చెట్లు విరిగిపడ్డాయి. లాక్డౌన్తో కోతలు సాగక, పంట ఉత్పత్తులు అమ్ముకోలేక అవస్థలు పడుతున్న రైతుల్ని వర్షాలు నిలువునా ముంచాయి.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాల కారణంగా, పిడుగుపాటుకు మొత్తం 14 మంది చనిపోయారు. వీరిలో అధికులు నేల్లూరు జిల్లాలో ఉన్నారు. 7 గురు వ్యక్తులు నెల్లూరు జిల్లలో మరణించగా, గుంటూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. అదేవిధంగా కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో ఈదురుగాలులకు పడవలు ముక్కలై నలుగురు మరణించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరులో ముగ్గురు, నాయుడుపేట మండలంలో ఇద్దరు, అల్లూరులో ఒకరు, బోగోలులో మరొకరు ప్రాణాలు విడిచారు.
ఈరోజూ, రేపూ కూడా వర్షాలు పడొచ్చు...
ఇదిలా ఉండగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుసే అవకాశాలున్నాయంటున్నారు. శనివారామ్ కూడా పలు ప్రాంతాల్లో వాతావరణం అదేవిధంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ అకాల వర్షాలతో వాతావరణం చల్లగా మారింది. పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి.