సీటు కోసం తరగతి గదిలో కొట్టుకున్న విద్యార్థులను బెదిరించడానికి ఉపాధ్యాయుడు చేసిన పని ఒక విద్యార్ధి చేతి మణికట్టు విరిగేలా చేసింది. వివరాలిలా ఉన్నాయి.
గుంటూరులోని మునిసిపల్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న షేక్ మహమ్మద్ సోహెద్, జావీద్ అనే విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం బెంచీపై సీటు కోసం గొడవ పడి కొట్టుకున్నారు. ఇది గమనించిన టీచర్ ఇద్దర్నీ హెడ్ మాస్టర్ దగ్గరకు తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు. ఆయన పిల్లలిద్దర్నీ మందలించి పంపించేశారు. అయితే, తరగతి గదికి వచ్చిన తర్వాత కూడా ఇద్దరూ దెబ్బలాడుకుంటుంటే ఇద్దరినీ మరోమారు టీచర్ మందలించారు. ఈ క్రమంలో సోహెద్ను కర్రతో కొట్టడంతో అతడి మణికట్టు విరిగింది. వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చేతికి కట్టు కట్టించారు. సోహెద్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.