నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. పరిశ్రమల్లో స్థానికులకు ప్రాధాన్యత కల్పించింది. టెండర్ల విషయంలో జడ్జి సిఫార్సులను సంబంధిత శాఖ తప్పనిసరిగా పాటించాలని చట్టం తీసుకురానుంది. ఏపీఈడీబీ-2018 చట్టం రద్దుకు నిర్ణయించింది. ఇలా ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం.
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జిరగింది. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కీలకమైన జ్యుడిషియల్ కమిషన్ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టెండర్ల ప్రక్రియలో పారదర్శక విధానానికి శ్రీకారం చుట్టామని.. అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగు వేశామని మంత్రివర్గం తెలిపింది. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో టెండర్లను పరిశీలిస్తామని వివరించింది. రూ.100 కోట్లకు పైబడిన ప్రాజెక్టులను జ్యుడిషియల్ కమిషన్ పరిధిలోకి తీసుకురావాలని.. జడ్జికి సహాయంగా నిపుణులను అందివ్వాలని నిర్ణయించింది.
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకం తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దానికి 'వైఎస్సార్ నవోదయం'గా నామకరణం చేసింది. మరోవైపు ఏపీఈడీబీ-2018 చట్టం రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాని స్థానంలో ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, మానిటరింగ్ యాక్ట్(ఏపీఐపీఎంఏ)కు ఆమోదం తెలిపింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50శాతం అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ విప్లవాత్మక చట్టానికి ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో చట్టం, ముసాయిదా బిల్లుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అలాగే బీసీలకు సీఎం వైఎస్ జగన్ మరో బంపర్ బొనాంజాను ప్రకటించారు. రజకులకు, నాయీబ్రాహ్మణులకు, టైలర్లకు ఆర్థిక సహాయంగా ఏడాదికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించించారు. ఇదిలా ఉంటే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది.