దేశం లోని ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తులను కల్సి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను వివరించామని వై.ఎస్.జగన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను ఆకాశానికి ఎత్తేశారు. దేశంలో మోడీ తరువాత అత్యంత పవర్ ఫుల్ నేత అమిత్ షా అని జగన్ అభివర్ణించారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అన్ని అంశాలను వివరించి చెప్పమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్టు జగన్ చెప్పారు. 'నవరత్నాలు' ఎలా అమలు చేస్తారన్న విలేకరుల ప్రశ్నకు జగన్ ఆసక్తికర సమాధానం చెప్పారు. కేంద్ర సాయం కోరింది అందుకేనని, రాష్ట్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం ప్రధాని మోడీ ని కలిసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన అమిత్ షా ను కలిశారు. ఈ సమావేశ వివరాలను అయన విలేకరులకు వివరించారు.