తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇరిగేషన్ శాఖా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారికి కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి.. ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచిన కొత్త ప్రాజెక్టుల పనులు, 25 శాతం లోపు పూర్తయిన ప్రాజెక్టుల పనులను నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు చేపట్టాలని సూచించారు. జిల్లాలవారీగా ఏ ప్రాజెక్టులను ఎప్పుడు పూర్తి చేయవచ్చో నివేదిక ఇస్తే వాటినే ఆయా సంవత్సరాల్లో ప్రాధాన్య ప్రాజెక్టులుగా పరిగణిస్తామన్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తామని ఈ సందర్బంగా సీఎం స్పష్టం చేశారు. అటు ఈనెల 20న జరగబోయే పోలవరం రివర్స్ టెండరింగ్ పై కూడా సమీక్ష నిర్వహించారు. 2021 నాటికి పోలవరం పూర్తి చేసేలోపే.. నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిందేనని అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లాలలో ప్రాజెక్టులు నింపడానికి చాలా సమయం పడుతోందని, లోపాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులకు సూచించారు.
నిన్నటివరకు శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కేవలం 6 నుంచి 8 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలమని, ఈసారి వచ్చిన వరదల వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కులకుపైగా తరలించామన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రతిస్తాత్మకంగా చేపట్టిన పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ పనులపై అధికారులు తగు నివేదిక అందించారు. ప్రాజెక్ట్ రెండు టన్నెళ్లలో మొదటి టన్నెల్ 2020 కల్లా పూర్తవుతుందని ముఖ్యమంత్రికి వివరించారు. మొదటి టన్నెల్ లో 1.56 కి.మీ. మేర పనులు మాత్రమే మిగిలాయని అధికారులు వివరించగా వాటిని వెంటనే పూర్తి చేయాలని, రెండో సొరంగం పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అలాగే ఉత్తరాంధ్ర వరప్రదాయిని వంశధార కెనాల్ లైనింగ్ పనులు, హీరమండలం రిజర్వాయర్ నుంచి హైలెవల్ కెనాల్ పనులు, డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించారు. కాగా రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పూర్తవడానికి కనీసం నాలుగేళ్లు పడుతుందని చెప్పారు సీఎం జగన్.