పిఠాపురం ఇంచార్జ్.. పవన్ కు టాటా చెబుతారా?

Update: 2020-01-18 11:10 GMT

తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు మరో షాక్ తగలనుందా? పిఠాపురం జనసేన ఇంచార్జ్ పార్టీ మారనున్నారా? ఇప్పుడివే ప్రశ్నలు జిల్లాలో హాట్ టాపిక్ అయ్యాయి. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన తరుపున 2019 లో పోటీ చేసిన మాకినీడి శేషు కుమారి గత కొంతకాలంగా జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే క్రమంలో అధికార వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్ వినబడుతోంది. కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో శేషు కుమారి పాల్గొన్నారు. దాంతో ఆమె త్వరలోనే పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆమె వివరణ ఇవ్వలేదు.

ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ గా శేషుకుమారి కొనసాగుతున్నారు. గడిచిన ఎన్నికల్లో ఆమె పిఠాపురం నుంచి పోటీ చేసి 28 వేల పైచిలుకు ఓట్లను సాధించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు 15 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఫలితాల తరువాత శేషుకుమారి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయనపై జనసేన కార్యకార్తలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ తరుణంలో శేషుకుమారి చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశం అయింది. 

Tags:    

Similar News