'జనసేన' కమిటీలను పార్టీ అధినేత పవన్కళ్యాణ్ ప్రకటించారు. ఏడు కమిటీలకు చైర్మన్లను సోమవారం ప్రకటించగా, మిగిలిన కమిటీల సభ్యుల వివరాలను ఆయా కమిటీల చైర్మన్లతో మాట్లాడిన అనంతరం ప్రకటిస్తామని పవన్కల్యాణ్ తెలిపారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర లోకల్బాడీ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ గా తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ పి.రామ్మోహన్రావు(ఐఏఎస్)ను నియమించారు. స్టేట్ కమిటీ ఫర్ మైనారిటీస్ ఛైర్మన్ గా విద్యావేత్త అర్హం ఖాన్ను, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ గా దళిత ఉద్యమనేత అప్పికట్ల భరత్భూషణ్ను ఎంపిక చేశారు.
రాష్ట్ర మహిళా సాధికారిత కమిటీ చైర్ పర్సన్ గా కర్నూలుకు చెందిన రేఖాగౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం జనసేన పార్టీ వీర మహిళా విభాగం ఛైర్మన్ గా ఉన్న ఆమెను ఆ బాధ్యతల నుంచి మార్పు చేశారు. పార్టీ రాష్ట్ర నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా జనరల్ సెక్రటరీ తోట చంద్రశేఖర్ (ఐఏఎస్)ను నియమించారు. రాష్ట్ర పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ ఛైర్మన్ గా జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (రాజోలు) పేరును ఖరారు చేశారు.
గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మోనిటరింగ్ కమిటీ రాష్ట్ర ఛైర్మన్ గా చింతల పార్థసారథిని ఎంపిక చేశారు. రాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీలో సభ్యులను కూడా నియమించారు.