సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు గానూ ఏపీ ప్రభుత్వం కొత్త పతాకాన్ని ప్రవేశ పెట్టనుంది. ఈ మేరకు ఈరోజు జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకానికి 'వైఎస్సార్ నవోదయం' అని పేరు పెట్టారు. మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)ను ఆదుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
జిల్లాల వారీగా 86 వేల ఎంఎస్ఎంఈల ఖాతాలను గుర్తించారు. రూ.4వేల కోట్ల రుణాలను వన్టైమ్ రీస్ట్రక్చర్ చేయనున్నారు. ఎన్పీఏలుగా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా దీని ద్వారా చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఎంఎస్ఎంఈలకు మరింత రుణంతో పాటు తక్షణ పెట్టుబడి అందే అవకాశం కలగనుంది. అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఎంఎస్ఎంఈలకు 9 నెలల వ్యవధి ఇవ్వనున్నారు.