సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతన్న లోకేష్-ఆర్కే ఫోటో

Update: 2019-06-19 10:13 GMT

హోరాహోరిగా తలపడ్డారు. అరవీర భయంకరంగా కలబడ్డారు. నరాలు తెగేలా ఉత్కంఠ రేపారు. ఫలితం వచ్చింది. విజేత ఎవరో తేలిపోయింది. ఒక్కసారిగా నిశ్శబ్దం. అవతలిపక్షంవాళ్లు షాక్‌లో కూరుకుపోయారు. ప్రత్యర్థి మామూలు వ్యక్తి కాదు. అటు మరో ప్రత్యర్థి మాములు వ్యక్తే. ఇద్దరిలో గెలిచింది మామూలు వ్యక్తే. మొన్నటి వరకూ ఇద్దరూ కలవలేదు. ముఖాలు కూడా చూసుకోలేదు. ఇప్పుడు వారిద్దరూ ఎదురుపడ్డారు. కానీ అందర్నీ ఆశ్యర్యానికి గురి చేశారు. నిన్న ఏపీ అసెంబ్లీ లాబీల్లో కంటపడిన ఆ చిత్రం, ఇప్పుడు హాట్‌ టాపిక్‌.

నవ్వానేనా అన్నట్టుగా ఎన్నికలు సాగుతున్న టైంలో, రాష్ట్రమంతా చర్చించుకున్న ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే, అది మంగళగిరినే. కోట్లకు కోట్లు బెట్టింగ్‌లు జరిగాయి. చంద్రబాబు కుమారుడు, స్వయాన మంత్రి అయిన లోకేష్‌ గెలుస్తాడా లేదా అన్నదానిపై జనం విపరీతంగా చర్చించుకున్నారు. మంగళగిరిపై ఎందుకంత ఆసక్తి అంటే, ఇప్పటి వరకూ టీడీపీ గెలవని మంగళగిరిలో పసుపు జెండా ఎగరేస్తానని లోకేష్‌ శపథం చేశారు అటు లోకేష్‌ను ఓడించి తీరుతానని మంగళగిరి ప్రజలకే కాదు, తన పార్టీ అధినేత జగన్‌కు సైతం మాటిచ్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. చివరికి గెలిచింది ఆళ్ల రామకృష్ణారెడ్డి. లోకేష్‌ ఓడిపోయారు.

రాబోయే కాలంలో కాబోయే తెలుగుదేశం అధినేత, అధికారమొస్తే అప్‌కమింగ్‌ సీఎంఅని కూడా లోకేష్‌పై అంచనాలుండేవి. కానీ అవన్నీ తలకిందులయ్యాయి. మంగళగిరి మహాక్షేత్రంలో తలపడ్డ ఈ ఇద్దరు నాయకులు, నిన్నటి వరకూ అసలు తారసడపలేదు. ఎదురుపడలేదు. కానీ అసెంబ్లీ చివరి రోజు వీరిద్దరూ ఎదురుపడ్డారు. ఈ చిత్రమే ఇప్పుడు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

లోకేష్ ఎమ్మెల్సీ. ఆర్కే ఎమ్మెల్యే. అసెంబ్లీ, మండలి, రెండు సభలూ పక్కపక్కనే కాబట్టి, ఇద్దరూ లాబీల్లో తారసపడ్డారు. లోకేష్ టీడీపీఎల్పీ వైపు వెళ్తుండగా ఆర్కే, ఆయనకు ఎదురుపడ్డారు. దీంతో ఆర్కేను పలకరించిన లోకేష్, ఆయనతో కరచాలనం చేసి కంగ్రాట్స్ చెప్పారు. ప్రతిగా ఆర్కే లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆ టైంలో క్లిక్‌మంది ఈ ఫోటో. లోకేష్-ఆర్కే కరచాలనం చిత్రం, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓడినా, గెలిచినా స్పోర్టివ్‌గా తీసుకోవాలన్నదానికి వీరే నిదర్శనమంటూ, చాలామంది కామెంట్‌ చేస్తున్నారు.  

Tags:    

Similar News