చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఈ నియోజకవర్గంనుంచి ఆరుసార్లు గెలుపొందిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్ధి రోజా చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన మృతిచెందారు. దాంతో ఆయన వారసులు ఇద్దరు రాజకీయ కదనరంగంలోకి దూకుతున్నారు. గాలి ఇద్దరు కొడుకులు తమ ఆధిపత్యపోరుతో వీధికెక్కుతున్నారు. తండ్రి బతికుండగా పెద్ద కొడుకు భానుప్రకాష్ పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించేవాడు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్ భానును పలుమార్లు మెచ్చుకున్నారు. అయితే ముద్దుకృష్ణమ నాయుడు మరణించాక ఆయన భార్య మాత్రం చిన్నకొడుకు జగదీశ్ కు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. తనకే టికెట్ ఇవ్వాలని భాను పట్టుబడుతున్నారు. దాంతో ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యతను టీడీపీ నేత బుద్ధా వెంకన్నకు అప్పజెప్పారు చంద్రబాబు. కానీ గొడవ సద్దుమణగలేదు. దాంతో నియోజకవర్గంలో సర్వే చేయించగా పెద్దకొడుకు భానుకు అనుకూలంగా సర్వే రిపోర్ట్ వచ్చింది.
అమరావతికి పిలిచి చంద్రబాబు.. గాలి కుటుంబసభ్యుల అందరితోనూ మాట్లాడారు. ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టపడి గెలిపించుకుంటామని ఆ సమయంలో వారు చెప్పినట్టు ప్రచారం జరిగినా.. నియోజకవర్గంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా మారింది. అన్నదమ్ములిద్దరు నగరి టికెట్ కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో గాలి కుటుంబానికి కాకుండా తనకు అవకాశం ఇవ్వాలని మరో నేత అశోక్ రాజు ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతో నగరి టీడీపీ వ్యవహారం మూడుముక్కలాటగా మారింది. అయితే ఇదే అదనుగా భావించిన వైసీపీ.. అన్నదమ్ముల వర్గపోరును తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఇంటింటి ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు రూపాయలకే భోజనం అంటూ మొబైల్ వ్యాన్లు గ్రామాల్లో తిప్పుతున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటూ ఈసారి ఎన్నికలకు మరింత బలపడేలా వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ కన్ఫర్మ్ చేశారు జగన్.