పార్లమెంట్ వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని వైసీపీ పార్లమెంటరీపక్ష నేత విజయసాయిరెడ్డి కోరారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరపడం ఏ విధంగా న్యాయం అవుతుందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విభజనకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి హోదా అంశం పరిశీలనలో లేదనడం ఎంతవరకు సమంజసమన్నారు. పార్లమెంట్లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కూడా ఆ ప్రక్రియలో భాగస్వాములై ఉన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. హోదా అంశంలో వెంకయ్యనాయుడు కూడా చొరవ చూపి ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని విజయసాయిరెడ్డి అభ్యర్థించారు.