ఏపీలో పెట్టుబడుల కోసం జగన్ ప్రభుత్వం తన వంతు కృషి మొదలు పెట్టింది. రేపు విజయవాడలో భారీ సదస్సు నిర్వహించనున్నారు. 35 దేశాలు ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో సీఎం జగన్... ఏపీలో పెట్టుబడులు పెట్టవలసిన అవశ్యకత గురించి వివరిస్తారు. పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలుమొదలెట్టింది. ఇందులో భాగంగా భారత విదేశాంగ శాఖ సమన్వయంతో రేపు విజయవాడలో భారీ సదస్సు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో 35దేశాల నుంచి దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సులేట్ జనరళ్లు పాల్గొంటారు.
ఆయా దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సీఎం జగన్ సమావేశమవుతారు. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ఇస్తున్న రాయితీల గురించి ఆయన వివరిస్తారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా నాణ్యమైన మానవనరులను అందుబాటులోకి తీసుకురానున్న అంశాన్ని ముఖ్యమంత్రి తెలియజేస్తారు. అవినీతిలేని పాలన, టెండర్లకు న్యాయ సమీక్షతో తమ ప్రభుత్వం స్వచ్ఛ పాలనకు కట్టుబడి ఉందని, అలాగే పారిశ్రామక అభివృద్ధి కోసం చేయూత అందించనుందని సీఎం వివరించనున్నారు.