నెల్లూరు జిల్లా ప్రజలకు శుభవార్త. కృష్ణపట్నం ఓబులవారి పల్లె రైల్వే లైన్ మొత్తం పనులు పూర్తి కానున్నాయి. త్వరలో ప్యాసింజర్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు మార్గంలో రైల్వే లైన్ డీజిల్ ట్రాక్షన్ విజయవంతమైంది. ఈ నెల 20న కృష్ణపట్నం- ఓబుళాపురం ఎలక్ట్రిక్ ట్రాక్షన్ నిర్వహించనున్ననేపథ్యంలో స్పెషల్ స్టోరీ. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైన్ గురించి 2002లో అప్పటి ప్రధాని వాజ్ పేయి వద్ద కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రతిపాదించడంతో ఆమోదం లభించింది. 1950 కోట్ల రూపాయలతో వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పనులు 2004 లో ప్రారంభమయ్యాయి.
కోస్తా, రాయలసీమ మధ్య ముడి సరుకులు, ప్యాసింజర్ రవాణాలో ప్రముఖ భూమిక పోషించే కృష్ణపట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైన్ విషయంలో ఏన్డీఏ తర్వాత అధికారంలోకి వచ్చిన యూపిఏ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. అంతేకాక ఈ ప్రాజెక్టుపై ఆర్.వి.ఎన్.ఎల్, రైల్వేబోర్డు, అధికారుల మధ్య తలెత్తిన నిధుల వివాదంతో పనులు మందగించాయి. 2014లో ఏన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. నాడు కేంద్ర మంత్రినున్న వెంకయ్యనాయుడు కృష్ణపట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైన్ గురించి ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లడంతో మళ్లీ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ రైల్వే లైన్ ను గత ఫిబ్రవరి 21న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు ప్రారంభించారు.
ఈ ప్రాజెక్ట్ టన్నెల్ విషయంలో చిన్నపాటి సమస్యలు ఉండటంతో ప్యాసింజర్ రైలు పట్టాలెక్కలేదు. ఇటీవల ఆర్వీఎన్ఎల్ అధికారులు నిర్వహించిన డీజిల్ ట్రాక్షన్ సక్సెస్ కావడంతో ఈ నెల 20 నుంచి ఎలక్ట్రిక్ ట్రాక్షన్ నిర్వహించనున్నారు. ఈ విషయం గురించి అధికారులు తెలుపడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ప్యాసింజర్ రైలు సౌకర్యం గురించి ఎంక్వయిరీ చేసిన ఆయన త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులకు ఉపరాష్ట్రపతి సూచించారు. కృష్ణపట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కోస్తా, రాయలసీమ అనేక ప్రాంతాల మధ్య రైల్వే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఇదేమార్గంలో ప్యాస్సెంజర్ రైళ్ల ను నడపితే నెల్లూరు- కడప జిల్లాపై రోడ్డు రవాణాపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం నెల్లూరు నుంచి కడప వెళ్లాలంటే కనీసం ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతోంది. ఈ కొత్త రైలుమార్గంలో ప్యాసెంజర్ రైల్లో కేవలం రెండుగంటల్లోనే నెల్లూరు నుంచి కడపకు చేరుకోవచ్చు. దశాబ్దన్నరం నాటి కృష్ణపట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైన్ కల త్వరలో సాకారం కానుండడంతో నెల్లూరు జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.