కోట్ల మనసు మార్చుకున్నారా?

Update: 2019-02-05 15:18 GMT

గత రెండు వారాలుగా కేంద్ర మాజీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల చంద్రబాబును కలవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో ఆయన టీడీపీలో చేరడం దాదాపు ఖాయమని అనుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం మీడియా ముందుకు వచ్చిన కోట్ల.. "నేను టీడీపీలో చేరినట్టు.. చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు, టీడీపీలో నేను చేరానన్నది అబద్ధం. పత్రికల్లో కొందరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసేశారు. రైతులు, నా కార్యకర్తల కోసం ఎల్ఎల్సీ, వేదవతి, గుండ్రేవుల, ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తి చేస్తానని మాట ఇస్తే నేను టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాను" అని కోట్ల స్పష్టం చేశారు.

దీంతో సడన్ గా పెద్దాయన ఇలా అనేశారేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో కొందరు అనుచరులకు టీడీపీలోకి వెళ్లడం ఇష్టం లేదనే వాదన వినబడుతోంది. మరోవైపు సీట్ల విషయం తేలని కారణంగానే కోట్ల ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.. అయితే ఇదే మంచి సమయం అనుకున్నారో ఏమో వైసీపీ నేతలు తమ పార్టీలో చేరాల్సిందిగా కోట్లను ఆహ్వానిస్తున్నారట.. ఈ నేపథ్యంలో కోట్ల నిర్ణయం ఏ విధంగా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తోంది క్యాడర్. 

Similar News