ఏపీలో యూకే స్ట్రెయిన్ విస్తరించిన దాఖలాలు లేవంటోంది వైద్య ఆరోగ్య శాఖ. కొత్త వైరస్ స్ట్రెయిన్పై అప్రమత్తంగా ఉన్నామని వైద్యారోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే కొత్త స్ట్రెయిన్ ఉందని ఆమెనుంచి మరెవరికీ స్ట్రెయిన్ విస్తరించలేదని ఆ శాఖ ప్రకటించింది. ఆమెతో సన్నిహితంగా ఉన్న కుమారుడికి కూడా పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ తెలిపారు.
ఏపీలో కరోనా వైరస్ పై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని కొత్త స్ట్రెయిన్ పై ఆందోళన అవసరం లేదని, అపోహల్ని నమ్మొద్దనీ వైద్య ఆరోగ్య శాఖ తెలియ చేసింది. యూకే నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చినవారు 1423 మంది కాగా, వారిలో 1406 మందిని ట్రేస్ చేశామని పేర్కొన్నారు. 1406 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా, 12 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యిందన్నారు. 1406 మందితో ప్రైమరీ కాంటాక్ట్ అయిన 6,364 మంది గుర్తించామని, వారందరికీ పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్గా తేలిందన్నారు. మొత్తం 24 పాజిటివ్ కేసుల శాంపిళ్లను సీసీఎంబీకి పంపించామని తెలిపారు. రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్ వచ్చిందని నిర్ధారణ అయ్యిందని, మిగిలిన 23 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందని కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు.