ఉన్నత విద్యావిధానంలో సమూల మార్పులపై దృష్టిసారించిన ముఖ్యమంత్రి జగన్.. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల నియంత్రణ తదితర అంశాలపై పర్యవేక్షణ కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్లో ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ ఐఏఎస్ అధికారి, ఉన్నత విద్యాసంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి ఈ కమిషన్కు సీఈవోగా వ్యవహరిస్తారు. ఇక ఈ ఉన్నత విద్యా కమిషన్ చైర్మన్గా ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య నియమితులు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఆయన నియామకంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ను సంప్రదించిన తరువాత జస్టిస్ ఈశ్వరయ్యను కమిషన్ చైర్మన్గా నియమించాలని భావిస్తోంది. ప్రధానంగా ఈ కమిషన్ పరిధిలోకి జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు వస్తాయి. ప్రవేశాలు, ఫీజులు, బోధన, పరీక్షలు, పరిశోధన, సిబ్బంది అర్హతలు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలన్నిటినీ ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది.