అరెస్టులతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరని జనసేన పార్టీ అంటోంది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ మండిపడుతోంది. రైతుల అరెస్టు నిరసిస్తూ.. ఈ మేరకు ఓ నోట్ విడుదల చేసింది. అందులో.. రాజదాని రైతులు ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. మంగళవారం చినకాకాని దగ్గర రైతులతో పోలీసులు వ్యవహరంచిన తీరు సమర్దనీయం కాదని.. రైతులను, మహిళలను భయపెట్టి వారిని నిరసన నుంచి దూరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని తెలిపింది. నిరసనలు మొదలుకాక ముందే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శీ బోనబోయిన శ్రీనివాస యాదవ్ ని గృహ నిర్బంధాన్ని ఖండించింది. అంతేకాదు పార్టీ కార్యదర్శి, చిల్లపల్లి శ్రీనివాస ను కారణం చెప్పకుండానే అరెస్ట్ చేసి పోలీస స్టేషన్ కు తరలించారని.. ఇలాంటి చర్యలతో ఆందోళనలను ఆపగలమని ప్రభుత్వం భావిస్తే అది పొరపాటే అవుతుందని పేర్కొంది. అమరావతి నుంచి రాజదానిని తరలించి భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడుతోంది.
ఈ క్రమంలో విశాఖపట్నం వాసులు కూడా పరిపాలన రాజధాని విషయంలో సంతృప్తిగా కనిపించడం లేదని లేఖలో పేర్కొంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర వెనకబాటుతనం ఉందని.. అక్కడి నుంచి వలసలు కూడా ఎక్కువగా ఉన్నాయని.. ఆ జిల్లాల అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు లేవని ఎద్దేవా చేసింది. రాయలసీమవాసులకి విశాఖపట్నం అంటే దూరాభారం అవుతుంది. సీమ నుంచి విశాఖ వెళ్ళాలి అంటే ప్రయాణం ఎంతో కష్టతరం.. ఈ విషయం సీమవాసుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను వైసీపీ ప్రభుత్వం పట్టనట్టుగానే వ్యవహరిస్తోందని చెప్పింది. అంతేకాదు రాజధాని మార్పు అనేది ఉద్యోగులకి ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తోందని, ఆనాడు హైదరాబాద్ నుంచి ఆమరావతికి తరలి వెళ్లిన ఉద్యోగులు తమ పిల్లలను విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చదివిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కుదురుకొంటున్నారని వాళ్ళను మళ్ళీ విశాఖకు పంపిస్తే వారి కుటుంబాలు ఎన్నీ వ్యయ ప్రయాసలకు లోనవుతాయని పేర్కొంది.
అన్ని ప్రాంతాలకు ఇది త్రిశంకు రాజధానిగా మారుతోంది. ఎవరికీ సంతృప్తి కలిగించటం లేదు. భూములు త్యాగం చేసిన ప్రాంతంలోనే రాజధాని ఉంచాలని అమరావతి ప్రాంతవాసులు కోరుతున్నారు. రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు రాజధాని ప్రాంతంలో చేసిన మహా పాదయాత్ర వారి ఆవేదనకు అద్ధంపట్టింది అని తెలిపింది. అమరావతిలో రైతులపట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఆందోళనలను అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు చేపడతారు గ్రహించాలి అంటూ జనసేన పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది.