కృష్ణా, గోదావరి అనుసంధానానికి సాయం చేయాలంటూ కేంద్రానికి జగన్ లేఖ
కృష్ణా, గోదావరి అనుసంధానానికి సాయం చేయండంటూ కేంద్రానికి లేఖ రాశారు ఏపీ సీఎం జగన్. రాయలసీమలో కరవును పారదోలడానికి గోదావరి నీటిని శ్రీశైలానికి మళ్లించడమే సరైన పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.
కృష్ణా, గోదావరి అనుసంధానానికి సాయం చేయండంటూ కేంద్రానికి లేఖ రాశారు ఏపీ సీఎం జగన్. రాయలసీమలో కరవును పారదోలడానికి గోదావరి నీటిని శ్రీశైలానికి మళ్లించడమే సరైన పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి సాయం చేయాలంటూ ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శ్రీశైలం డ్యాం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి లభ్యత భారీగా పడిపోయిన నేపథ్యంలో రాయలసీమలో కరవును పాలదోలడానికి తమకు నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని కేంద్రానికి రాసిన లేఖలో వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో గోదావరి నీటిని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు ఎత్తిపోయడం ఒక్కటే సమస్యకు పరిష్కారమని పేర్కొన్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధవారం సాయంత్రం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ను కలిసి సీఎం జగన్ రాసిన లేఖను అందజేశారు. నదుల అనుసంధానానికి కేంద్రం సాయం కోరడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితిపైనా సీఎం జగన్ తన లేఖలో ప్రస్తావించారు. కరవు, వర్షపాతం లోటులో అనంతపురం జిల్లా.. రాజస్థాన్లోని జైసల్మేర్ను తలపిస్తోందని వివరించారు. 'రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర కరవు ఉందని, ఈ జిల్లాల్లో గడిచిన పదేళ్లుగా దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో వివరించారు. గడచిన 52 ఏళ్లలో శ్రీశైలం ప్రాజెక్టులోకి సగటున 1128 టీఎంసీల నీళ్లు వస్తే.. గత పదేళ్లలో వచ్చిన జలాలు సగటున 632 టీఎంసీలు మాత్రమేనన్నారు. గత ఐదేళ్లలో సగటున 416 టీఎంసీలు మాత్రమే కృష్ణా నీళ్లు వచ్చాయని, ఐదేళ్లలో నీటి లభ్యత 63 శాతం పడిపోయిందని జగన్ వివరించారు.
'మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఎగువన ప్రాజెక్టుల అధికంగా నిర్మించడం వల్ల నీళ్లు కిందకు రావడంలేదన్నారు. ఆల్మట్టి ఎత్తు 519.6 నుంచి 524.2 మీటర్లకు పెంచుతున్నారని, దీనివల్ల ఏపీకి వచ్చే నీళ్లలో 100 టీఎంసీలు కోత పడతాయని తెలిపారు. మరోవైపు గోదావరి జలాలు పెద్ద ఎత్తున సముద్రంలో కలుస్తున్నాయని, అందువల్ల గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు నీటిని తరలించాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి నీటిని సాగర్, శ్రీశైలానికి ఎత్తిపోయడమే ఈ సమస్యకు పరిష్కారమని జగన్ వివరించారు. ఉభయ రాష్ట్రాలకూ ఆమోద యోగ్యమైన ఒప్పందం ద్వారా రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలకు నీటిని తరలించాలన్నది ప్రతిపాదన అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించాలని జగన్ కేంద్రాన్ని కోరారు.