సుదీర్ఘమైన తీర ప్రాంతం, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు ఏపీ సొంతమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. డిప్లొమాటిక్ ఔట్ రిచ్ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసిన ఆయన .. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు లేకపోవడం రాష్ట్రానికి పెద్ద లోటన్న జగన్ ఏపీకున్న వనరులే కొండంత అండ అన్నారు. అవినీతి రహిత పారదర్శకపాలన సాగిస్తున్న తమ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోందని అన్నారు. పరిశ్రమలు పెట్టే వారి కోసం స్ధానికంగా ఉండే యువతకు ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్టు తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.