ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ నగరం మొత్తం జగన్ ప్లెక్సీలు, పోస్టర్లతో నిండిపోయింది. తాజాగా విజయవాడలోని కనకదుర్గ వారధి వద్ద ఏకంగా 70 అడుగులు ఉన్న జగన్ కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేశారు. ఇందులో వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బొమ్మలను చేర్చారు.భారీ ఆకారంలో ఉన్న ఈ కటౌట్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. వైఎస్ జగన్ రేపు మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.