దైవ నిర్ణయం కారణంగా తానూ విజయం సాధించానని జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే అన్నారు కానీ, దైవ నిర్ణయం కంటే ప్రజా నిర్ణయం గొప్పదని నేను నమ్ముతాను. ప్రజలను మార్చడంలో దేవుడు ఎప్పుడో ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రజలు దేవుళ్లను మార్చగలరు. ఇన్ని కోట్ల మంది చేతులు ఎత్తి ఎవరికి మొక్కితే వాళ్లే దేవుడు. అందరూ కలిసి జగన్ గారికి ఈరోజు మొక్కేశారు అందుకే జగనే దేవుడు అని ప్రాముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ పై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పూరి స్పందిస్తూ ఫలితాల వెల్లడి అనంతరం జగన్ మీడియా సమావేశాన్ని తాను టీవీలో చూశానని తెలిపారు. 'జగన్ మొహంలో విజయగర్వం లేదు. ఇన్ని తలలు నరికాను అన్న పొగరు లేదు. కామ్ గా ఉన్నాడు. సేద తీర్చుకుంటున్నాడు.
జగన్ ముఖంలో గెలుచుకున్న సీఎం పదవి కంటే ఆయనకు పొడిచిన వెన్నుపోట్లే కనిపించాయి. ఒంటరిగా ఎన్నోసార్లు ఏడ్చిన కన్నీళ్లు కనిపించాయి. వాళ్లింట ఆడవాళ్ల వేదనలు కనిపించాయి. ఏది ఏమయినా రాజన్న కొడుకు అనిపించాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ యోధుడు. అటువంటి వారికి ప్రజాబలం తోడైంది. ఇక అద్భుతాలు జరుగుతాయని పూరీ అన్నారు.