అది మన హక్కు.. ఇచ్చే వరకూ అడుగుతూనే ఉంటాం : జగన్

Update: 2019-05-26 09:41 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం ఆయన ఆదివారం న్యూఢిల్లీలో ఏపీ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానికి వివరించామని, రాష్ట్రానికి అన్నిరకాల సాయం అవసరమని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రధాని కూడా సానుకూలంగా స్పందిస్తారని తాను భావిస్తున్నానట్లు జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్రానికి అందాల్సిన సాయం ఆలస్యం అయిందని, రాష్ట్రంలోని అన్ని పరిస్థితులు ప్రధానికి వివరించామన్నారు. 

హోదా ఆంధ్రుల హక్కు

రాష్ట్రం విడిపోయేనాటికి 97వేల కోట్ల అప్పులు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు అయిదేళ్ల పాలనలో 2.57 లక్షల కోట్లకు పైగా అప్పులు పెరిగాయని జగన్‌ తెలిపారు. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా ఇచ్చేవరకూ ప్రధానిని తాము అడుగుతూనే ఉంటామని ఆయన చెప్పారు. ఇక రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. ఇవాళ్ట నుంచి ఆరు నెలల్లోగా ప్రభుత్వంలో నిర్మాణాత్మక మార్పులు చేస్తామన్నఆయన .. మొత్తం వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. అవినీతి అన్నది ఎక్కడా లేకుండా, పారదర్శక పాలన అందిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. 

Similar News