అసలు శాసనమండలి రద్దు ఎలా జరుగుతుంది.. జగన్ ప్రభుత్వం అనుకుంటే రద్దు జరిగిపోతుందా?

Update: 2020-01-27 04:44 GMT

అసలు శాసనమండలి రద్దు ఎలా జరుగుతుంది? జగన్ ప్రభుత్వం అనుకుంటే రద్దు జరిగిపోతుందా? లేక కేంద్రం ఒప్పుకోవాలా? బిల్లులను అడ్డుకున్నట్లే మండలి రద్దును కూడా విపక్షాలు అడ్డుకోగలవా? అసలు మండలి రద్దు ప్రక్రియకు ఎంతకాలం పడుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చూడండి.

50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా మండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కీలక బిల్లులు ఆమోదం పొందకుండా వెనక్కి వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ కార్పొరేషన్ బిల్లులను కౌన్సిల్ తిప్పిపంపడంతో మండలిని రద్దు చేస్తామంటూ హెచ్చరికలు పంపిన వైసీపీ సర్కారు ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మండలిలో చుక్కెదురు కావడంతో కౌన్సిల్ రద్దు వైపు జగన్ ప్రభుత్వం అడుగులేస్తోంది.

అయితే, మండలిని రద్దు చేయాలంటే మొదటగా శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. శాసనసభలో ఎలాగూ జగన్ ప్రభుత్వానిదే మెజారిటీ కనుక తీర్మానం ఆమోదం పొందడం ఖాయమే. ఆ తర్వాత ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతారు. అలా అది కేంద్ర హోంశాఖకు చేరుతుంది. అయితే, శాసనసభ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంట్లో ఆమోదం పొందితే, ఆ తర్వాత రాష్ట్రపతి సంతకంతో మండలి రద్దు అవుతుంది. అయితే, పార్లమెంట్ కి విచక్షణాధికారాలు ఉంటాయి. దాంతో, కేంద్రానికి ఇష్టంలేకపోతే మాత్రం మండలి రద్దు విషయంలో జగన్ ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లయ్యే అవకాశం ఉండదు. పైగా ఇప్పుడు బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో మండలి రద్దు విషయంలో చుక్కెదురయ్యే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే, మూడు రాజధానులను జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా ఏపీ బీజేపీ కూడా అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలంటూ తీర్మానం చేసింది. దాంతో, మండలి రద్దు జగన్ ప్రభుత్వం అనుకున్నంత సులువు కాదనే మాట వినిపిస్తోంది.

అయితే, శాసనమండలి అనేది సూచనలు, సలహాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదని, అందువల్ల మండలి రద్దుకు శాసనసభ తీర్మానంచేసి పంపితే చాలు, దాన్ని కచ్చితంగా పార్లమెంట్ ఆమోదించి తీరుతుందని అంటున్నారు. ఇందులో రాజకీయాలు ఏమీ ఉండవని వైసీపీ నేతలు చెబుతున్నారు. అందుకు, ఎన్టీఆర్ హయాం నాటి ఘటనను గుర్తుచేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ కూడా శాసనమండలిని రద్దు చేశారని, అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే కేంద్రం నో చెప్పే అవకాశమే ఉండదని అంటున్నారు.

మండలి రద్దు ప్రక్రియకు ఏడాది లేదా ఏడాదిన్నర పట్టొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కేంద్రాన్ని ఒప్పించుకుంటే, ఆర్నెళ్లు, ఏడాదిలోపే రద్దు చేయొచ్చని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్నందున మండలి రద్దుకు మోడీ ప్రభుత్వం సహకరిస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News