అధికార పక్షమైనా ప్రతిపక్షమైన ప్రజలతోనే నా జీవితం : మాజీ మంత్రి దేవినేని
స్థానిక ఎన్నికలకు సమయం ఆసన్నమైనదని అన్ని గ్రామాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కష్టించి పనిచేయాలని దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం జి.కొండూరు మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాలలో గెలుపోటములు సహజమని, ఓటమిని కలతవీడి గెలుపుకోసం కష్టించి పనిచేయాలని తెలిపారు. అంకితభావంతో పనిచేస్తే ప్రజల మెప్పు ఎప్పుడూ ఉంటుందని, మైలవరం నియోజకవర్గంలో ఐదేళ్ళలో జరిగిన అభివృద్ధి పనులను ప్రతి ఒక్క కార్యకర్త గుండె ధైర్యంతో చెప్పొచ్చని తెలిపారు. ఇప్పుడే స్థానిక ఎన్నికలపై కార్యకర్తలు దృష్టి పెట్టి ఓట్లను పరిశీలించుకోవాల్సిందిగా సూచించారు. ఎవరికి వారు విడివిడిగా కాకుండా కలసికట్టుగా పనిసీజయలని ఉమా హితవు పలికారు. అధికారంలో ఉండగా తాను మంజూరు చేయించి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపక్షంలో ఉన్నా పోరాడయినా సరే పూర్తి చేయించి ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకు వస్తానని అంతే తప్ప విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారమైనా ప్రతిపక్షమైన ప్రజలతోనే తన జీవితం కొనసాగుతుందని దేవినేని స్పష్టం చేశారు.