తెలంగాణ తరహాలో ఏపీలో భారీ ఈఎస్ఐ స్కాం
తెలంగాణ తరహాలో ఏపీలో భారీగా ఈఎస్ఐ స్కాం వెలుగులోకి వచ్చింది. గత ఆరు సంవత్సరాలుగా కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు.
తెలంగాణ తరహాలో ఏపీలో భారీగా ఈఎస్ఐ స్కాం వెలుగులోకి వచ్చింది. గత ఆరు సంవత్సరాలుగా కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ కొటేషన్లు సృష్టించి రేట్ కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు ఆధారాలు దొరికాయి. రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు మందులు కొనుగోలు చేసినట్లు నకిలీ ఇండెంట్లు సృష్టించారు. ప్రభుత్వం మొత్తం 89 కోట్ల రూపాయలు చెల్లిస్తే... రేట్ కాంట్రాక్టులో ఉన్న సంస్థలకు 38 కోట్లు చెల్లించగా... 51 కోట్ల రూపాయలు అక్రమంగా చెల్లించారు. వాస్తవ ధర కంటే 132 శాతం అధికంగా డబ్బులు చెల్లించారు.
తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో పాత్ర పోషించిన వారు ఏపీలో కూడా భారీ స్కాంకు పాల్పడినట్లు గుర్తించారు. అప్పటి డైరెక్టర్లు రవి కుమార్, రమేష్ కుమార్, విజయ్ కుమార్లతో పాటు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు , ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్లే బాధ్యులని అధికారులు తేల్చారు. ఈ ముగ్గురు డైరెక్టర్లుగా వ్యవహరించిన హయాంలో 975 కోట్ల రూపాయల మందులు కొనుగోలు చేస్తే.. అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులకు చెల్లించినట్లు తెలుస్తోంది.
మందుల కొనుగోలుకు ప్రభుత్వం 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే... ముగ్గురు డైరెక్టర్లు 698 కోట్ల రూపాయలకు మందులు కొనుగోలు చేశారు. దీంతో ప్రభుత్వానికి 404 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు టెలీహెల్త్ సర్వీస్కు కోట్ల రూపాయలు ఈఎస్ఐ చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ టెలీ హెల్త్ సర్వీస్ అచ్చెన్నాయుడు ద్వారా కాంట్రాక్టులు తెచ్చుకున్నట్టు సమాచారం.