Andhra Pradesh: ముద్రగడ కుటుంబంపై లాఠీచార్జ్‌ చేస్తే పవన్ ఎక్కడున్నాడు?: ఎమ్మెల్యే ద్వారంపూడి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని జనసేన కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు.

Update: 2020-01-12 11:19 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని జనసేన కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఇంతలో విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు కూడా భారీగా చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. దీంతో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్‌పై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని అలాగే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.

వైసీపీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్.. చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నాడని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రతరం అయింది.దాంతో ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. ఘటనలో పలువురు వైసీపీ, జనసేన కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. చివరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ.. తాను పవన్‌పై చేసిన వ్యాఖ్యలను జనసేనకు చెందిన కొందరు నేతలు పని గట్టుకొని కుల ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

పవన్ కళ్యాణ్ ఇవాళ రాజకీయాల్లోకి వచ్చాడు తాను ఎప్పుడో దివంగత వంగవీటి మోహన రంగా గారి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారాయన. కాపు ఉద్యమ సమయంలో ముద్రగడ కుటుంబంపై లాఠీచార్జ్‌ చేస్తే పవన్‌ గానీ జనసేన నాయకులు కానీ ఖండించలేదు. ముద్రగడ బహిరంగ సభ పెడితే నా వెంట ఉన్న కాపులంతా 25 బస్సులతో వెళ్లి ఉద్యమానికి మద్దతిచ్చాం. కాపు ఉద్యమానికి చంద్రబాబు వ్యతిరేకం. అందుకే పవన్‌కళ్యాణ్‌ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అంటూ ద్వారంపూడి వ్యాఖ్యానించారు.  

Tags:    

Similar News