ఉండవల్లి కరకట్ట వెంబడి నిర్మాణాల కూల్చివేతలపై సీఆర్డీఏ వివరణ ఇచ్చింది. మొత్తం 24 అక్రమ కట్టడాలను గుర్తించినట్లు తెలిపింది. వాళ్లందరికీ నోటీసులిచ్చామని.. అందులో ఐదుగురు వివరణ ఇచ్చినట్లు స్పష్టం చేసింది. అయితే ఆ ఐదుగురు యజమానుల వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఆర్డీఏ.. ప్రస్తుతానికి పాతూరి కోటేశ్వరరావు ఇంట్లో అక్రమ నిర్మాణాన్ని కూల్చేసినట్లు ప్రకటించింది.
ఇటు చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని నివాసాన్ని కూడా కూల్చేసినట్లు ఈ ఉదయం కథనాలు వెలువడ్డాయి. దీనిపై మంత్రి బొత్స సత్యానారాయణ వివరణ ఇచ్చారు. అక్రమ కట్టడాలపై చట్టప్రకారమే చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు అక్రమ కట్టడంలో నివసించడం మంచిది కాదన్న ఆయన.. వారం రోజుల్లో తొలగించాలని నోటీసులు ఇచ్చామని.. తొలగించకపోతే ప్రభుత్వమే తొలగిస్తుందని స్పష్టం చేశారు.