ఏపీలో పాజిటివ్ కేసుల రేటు తక్కువే : జవహర్ రెడ్డి
రాష్ట్రంలో కొత్తగా నమోదైన 61 కరోనా పాజిటివ్ కేసుల్లో శ్రీకాకుళం జిల్లాలో మూడు కేసులు వచ్చాయని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కొత్తగా నమోదైన 61 కరోనా పాజిటివ్ కేసుల్లో శ్రీకాకుళం జిల్లాలో మూడు కేసులు వచ్చాయని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాదుతూ.. పాతపట్నం మండలంలోనే నమోదయ్యాయని అన్నారు. పాతపట్నానికి చెందిన వ్యక్తి ఢిల్లీ పనిచేసేవాడని, అతను జిల్లాకు వచ్చినప్పుడు పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చిందన్నారు. మరోసారి పరీక్షించగా పీసీఆర్ టెస్టులో నెగిటివ్ వచ్చిందని చెప్పారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల్లో పాజిటివ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు.
దేశంలోని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించామని జవహర్ రెడ్డి అన్నారు.కరోనా పరీక్షల్లో తేలిన పాజిటివ్ కేసుల రేటు కూడా రాష్ట్రంలో తక్కువగా ఉందని అన్నారు. దేశంలో ప్రతి 10 లక్షల మందికి సగటున 418 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా.. రాష్ట్రంలో 1,147గా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 61,266 మందికి ఇప్పటి వరకు టెస్టులు నిర్వహించామన్నారు. పాజిటివ్ కేసుల నమోదు రేటు 1.66 శాతంగా మాత్రమే అని ఆయన వివరించారు. జాతీయ సగటు 4.23 శాతంగా తక్కువగా వుంది చెప్పారు. అత్యధికంగా మహారాష్ట్రలో 7.16గా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 171 మంది కోలుకున్నారని, ఇవాళ ఒక్కరోజే 26 మంది డిశ్చార్జి అయ్యారని జవహర్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్తగా తేలినా 61 కేసుల్లో 51 పాజిటివ్ కేసులు క్లస్టర్ల నుంచే వచ్చాయని జవహర్ రెడ్డి తెలిపారు. 10 కేసులు క్లస్టర్లు లేని ప్రాంతం నుంచి వచ్చాయన్నారు. దాంతో రాష్ట్రంలో క్లస్టర్ల సంఖ్యను 196కు సవరించామని చెప్పారు. అనేక మంది వైద్యులు, సిబ్బంది స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకొచ్చారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 17 కొవిడ్ ఆస్పత్రులు ఉండగా.. అందులో 12 ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలందేవని చెప్పారు. డయాలసిస్ రోగులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రికి సేవలను తరలించామన్నారు. రాష్ట్రంలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే 104కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.