Coronavirus: ఏపీ రాజ్భవన్లో కరోనా కలకలం.. నలుగురికి పాజిటివ్
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 81 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 81 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1097 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 835 మందికి చికిత్స అందిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య 31గానే ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కర్నూలు తర్వాత అమరావతి పరిధిలోని కృష్ణ, గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. రెండు జిల్లాలలో 392 కేసులు నమోదయ్యాయి. ఆదివారం గుంటూరు లో మూడు, కృష్ణ జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయి. ఏపీ రాజ్ భవన్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కాగా.. రాజ్ భవన్లో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా నిర్ధారణ అయిందని తెలుస్తుంది. దీంతో గవర్నర్ సహా ఎనిమిది మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురికి పాజిటివ్ అని తెలుస్తోంది. వైద్యసిబ్బందిలో ఒకరి వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీనే మీడియాకు చెప్పారు. అయన ఇంట్లో వైరస్ సోకిన వారిలో ఎంపీ ఇద్దరు సోదరులు, వారి సతీమణులకు,14 ఏళ్ల బాలుడు తోపాటు, 83ఏళ్ల తండ్రికీ వైరస్ నిర్ధారణ అయింది. ఆరుగురిలో నలుగురు వైద్యులు అని వార్తలు వచ్చాయి. దీనిపై ఎంపిని అడగగా నిజమేనని చెప్పారు.ఇదే విషయమై ఎంపీ మీడియాతో మాట్లాడుతూ... తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందన్న వార్తలు నిజమేనని పేర్కొన్నారు. తన కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. కోవిడ్ ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా సోకుతోందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కర్నూలు జిల్లాలో 279 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.