ఏపీలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన సీఎం జగన్

ఏపీలో కోవిడ్‌ టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.

Update: 2021-01-16 10:13 GMT
కరోనా టీకా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 

ఏపీలో కోవిడ్‌ టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. విజయవాడ జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్‌ , వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ పాల్గొని టీకా పంపిణీని ప్రారంభించారు. తొలి టీకా పారిశుద్ధ్య కార్మికురాలు పుష్పకుమారికి ఇచ్చారు. ఏపీలోని 332 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేస్తున్నారు. రాష్ట్రానికి 4.96 లక్షల డోసుల టీకా వచ్చింది. ఇందులో 20వేల డోసులు కొవాగ్జిన్‌, మిగిలినవి కొవిషీల్డ్‌. తొలివిడతలో కొవిషీల్డ్‌నే వేయనున్నారు. తొలిరోజు ఒక్కోచోట వందమంది చొప్పున 332 కేంద్రాల్లో 33వేల200 మందికి టీకాలు ఇవ్వబోతున్నారు.

ప్రాధాన్యక్రమంలో వీరి సెల్‌ఫోన్లకు శుక్రవారం నుంచి మెసేజ్‌ వెళ్లడం మొదలైంది. దీని ప్రకారం వారు టీకా వేయించుకోవాలి. గుర్తింపుకార్డు చూపిస్తేనే పంపిణీ కేంద్రానికి అనుమతిస్తారు. కనీసం 15 రోజుల వరకు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రోజూ 33వేల 200 మందికి టీకా వేస్తారు. టీకా వేయించుకున్న వారికి తిరిగి 28 రోజుల తర్వాత మలివిడత టీకా వేయనున్నారు. ఈ 332 కేంద్రాల్లో కలిపి 2వేల324 మంది విధులు నిర్వర్తించబోతున్నారు. ప్రతి కేంద్రంలో మూడు గదులు ఏర్పాటుచేశారు. టీకా పంపిణీ సందర్భంగా ఎవరికైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తితే వెంటనే చికిత్స అందించేందుకు ప్రత్యేక బృందాలను వైద్యశాఖ సిద్ధం చేసింది.

Tags:    

Similar News