సుజనా పై ఫిర్యాదును హోంశాఖకు పంపించిన రాష్ట్రపతి
రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని..
రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని.. అతని అక్రమ సంస్థలు, మనీలాండరింగ్ వ్యవహారాలు, అంతర్జాతీయంగా అతను చేసిన వ్యాపార కుంభకోణాల గురించి ఎంక్వయిరీ చెయ్యాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. సుజనా చౌదరి అవినీతిపై ఈడీ, సిబిఐ దర్యాప్తు చేయాలని కోరినట్లు విజయసాయి లేఖలో పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాష్ట్రపతి ఈ లేఖపై స్పందించి హోం మంత్రిత్వ శాఖకు పంపారు. దీనిని రాష్ట్రపతి కార్యాలయం పంపినప్పటి తరువాత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఈ నోట్ను అన్ని విభాగాలకు పంపించింది. దర్యాప్తు చెయ్యమని ప్రభుత్వం ఆదేశిస్తే, సుజన చౌదరి తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
అయితే, సుజన బిజెపిలోనే ఉన్నందున, విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందో లేదో అన్నది ఆసక్తిగా మారింది. అయితే విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై సుజనా చౌదరి స్పందించారు. 'నాపై విజయసాయిరెడ్డి సెప్టెంబరు 26న లేఖరాయగా, దానిని దాదాపు నెలన్నర తర్వాత... నవంబరు 6న రాష్ట్రపతి కార్యాలయం కేంద్ర హోంశాఖకు పంపింది. ఫిర్యాదు అందినట్లుగా రాష్ట్రపతి భవన్ ఇచ్చిన రశీదును పట్టుకుని నా ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు' అని విజయసాయిరెడ్డిపై మండిపడుతున్నారు.