ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. మంత్రులు ముత్తశెట్టి శ్రీనివాసరావు , కన్నబాబు, ధర్మాన కృష్ణదాసు , ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాధ్, గొల్ల బాబురావు, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ దాదాపు 13 వందల కోట్ల రూపాయలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి తాటిచెట్ల పాలెం - సిరిపురం మీదుగా 24 కిలోమీటర్ల వరకు వేలాదిమంది జనంమానవహారం లాగా ఏర్పడ్డారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను ప్రకటించిన సందర్బంగా థాంక్యూ సీఎం అని చెప్పారు.
అంతకుముందు విశాఖ, అనకాపల్లి ఎంపీలు సత్యనారాయణ, సత్యవతి లు భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సీఎం తన పర్యటన సందర్బంగా మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో రూ.905.50 కోట్లు, విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) పరిధిలో రూ.379.82 కోట్ల మేర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విశాఖ ఉత్సవ్ను కూడా ఆయన ప్రారంభించనున్నారు.
మరోవైపు విశాఖ ఉత్సవ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. శని ఆది వారాల్లో ఈ ఉత్సవాలు జారుతుతున్నాయి.. ముందుగా శనివారం మధ్యాహ్నం బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ జంక్షన్ నుంచి కార్నివాల్ ప్రారంభమైంది. ఈ సందర్బంగా శకటాలు, వివిధ కళారూపాలు, జానపదాలు ఇందులో ప్రదర్శితం అయ్యాయి.. సాయంత్రం 5.30కు ఆర్కే బీచ్లో ఉత్సవ్ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించి అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు..