వైఎస్సార్ చేయూత పథకం గురించి టీడీపీ వక్రీకరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. పేద మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్న తన హామీని గతంలో టీడీపీ వెటకారం చేసిందని ఆయన గుర్తు చేశారు. విశాఖ జిల్లా కె కోటపాడు సభలో ప్రకటించిన వైఎస్సార్ చేయూత పథకం వీడియో క్లిప్ ను ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రదర్శించారు.
అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ..తన పాదయాత్ర హామీలను ప్రస్తావించారు. పేద ఎస్ సి, ఎస్ టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని పాదయాత్రలో తను చెప్పగా, టీడీపీ వెటకారం చేసిందని జగన్ గుర్తు చేశారు.
సభలో 2017, అక్టోబర్ 18 న పేపర్ కటింగ్ ను టీడీపీ సభ్యులు ప్రదర్శించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నుంచి ఆ పేపర్ క్లిప్ ముఖ్యమంత్రి తెప్పించుకున్నారు. 2018 సెప్టెంబర్ 3న విశాఖ జిల్లా కె కోటపాడు సభలో తను ప్రకటించిన వైఎస్సార్ చేయూత పథకం వీడియో క్లిప్ ని సీఎం జగన్ ప్రదర్శించారు. వైఎస్సార్ చేయూత పథకం గురించి టీడీపీ వక్రీకరిస్తుందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పడం తమ ఇంటావంటా లేదని జగన్ స్పష్టం చేశారు.