ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ నేత, వ్యాపారవేత్త అయోధ్యరామిరెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. అక్కడ నూతన వధూవరులను అయన ఆశీర్వదించారు. జగన్ తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు. అయోధ్య రామరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత అన్నదమ్ములు అన్న విషయం తెలిసిందే. ఇందులో అయోధ్యరామిరెడ్డి వ్యాపార రంగంలోకి వెళ్ళగా, రామకృష్ణారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక 2014 ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా అయోధ్యరామిరెడ్డి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు.
ఇక సీఎం జగన్ విశాఖపట్నం వెళ్లనున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్ జగన్ 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 10.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10.40 గంటలకు చినముషిడివాడలోని శారదా పీఠానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం శారదాపీఠం నుంచి 12.50కి సీఎం వైఎస్ జగన్ విశాఖ విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకోనున్నారు.