బడేటి బుజ్జి హఠాన్మరణం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి
గురువారం తెల్లవారుజామున ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే.
గురువారం తెల్లవారుజామున ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. బుజ్జి మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హఠాత్తుగా బుజ్జి దూరమవడం బాధాకరమన్నారు. ఆయన మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఏలూరు అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. ఏలూరును స్మార్ట్సిటీగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేశారన్నారు.
ఆయన మృతి ఏలూరు నియోజకవర్గానికే కాకుండా, తెలుగుదేశం పార్టీకి కూడా తీరని లోటని పేర్కొన్నారు. బుజ్జి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు చంద్రబాబు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా బుజ్జి మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన మృతి చాలా బాధ కలిగించిందని.. పార్టీకి కూడా తీరని లోటని.. ప్రజల శ్రేయస్సు గురించే ఆలోచించేవారని పేర్కొన్నారు.