వైసీపీ అధినేత వైయస్ జగన్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. వైకాపా వ్యవస్థాపకుడు శివకుమార్ను సస్పెండ్ చేయడంపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఇందుకోసం మార్చి 11 వరకు గడువు ఇచ్చింది. కాగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని తొలుత వైయస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని కొలిశెట్టి శివకుమార్ స్థాపించారు. ఆ తరువాత వైయస్ జగన్ అధ్యక్షుడిగా, విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
అయితే ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల సందర్బంగా పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని వైసీపీ లెటర్ ప్యాడ్ మీద సంతకం చేసి మీడియాకు ఇచ్చారు శివకుమార్. అతని చర్యలతో షాక్ అయిన వైసీపీ.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తనను సస్పెండ్ చేసే అధికారం జగన్కు లేదని, పార్టీ తనదేనని, వ్యవస్థాపక నియమ నిబంధనలను జగన్ పక్కన పెట్టారని శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.