గత ప్రభుత్వ అవినీతి బాగోతాలపై కేబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఈరోజు నిర్వహించిన ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ సంస్థల సహకారం విద్యుత్రంగ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మొత్తం 30 అంశాలపై విచారణ చేస్తామని ఆయన చెప్పారు. కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై సీఎం దృష్టి సారించారు. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లావర్, విండ్ పవర్ కొనుగోళ్లపై విస్తృత చర్చ జరిగింది. అసలు కాంపిటేటివ్ బిడ్డింగ్ రేట్లకన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని అధికారులను జగన్ అడిగారు. దీనివలన ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్లు నష్టం వాటిల్లిందని రివ్యూలో వెల్లడి కావడంతో ఈ డబ్బును రికవరీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. సోలార్, విండ్ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దుచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సోలార్, విండ్ కంపెనీల్లో ఒప్పందాల్లో భారీ దోపిడీ స్పష్టం అవుతున్న మీదట ఈ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి, అప్పటి మంత్రి, అప్పటి ముఖ్యమంత్రిపైనా న్యాయపరమైన చర్యలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.