తిరుమల తిరుపతి దేవస్థానములు నూతన తిరుపతి జెఈవోగా పి.బసంత్కుమార్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఉదయం శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తిరుమల జెఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు రంగనాయకుల మండపంలో తిరుమల ఇన్చార్జ్ జెఈవో ఎఫ్ఏసిగా తిరుపతి జెఈవో పి.బసంత్కుమార్కు బాధ్యతలు అప్పగించారు.
ఆలయం వెలుపల జెఈవో మీడియాతో మాట్లాడుతూ మనసా, వాచా, కర్మన శ్రీవారి భక్తులకు సేవ చేయనున్నట్లు తెలిపారు. భక్తుల సేవ ద్వారా శ్రీవారి సేవ చేసే అవకాశం కలగడం పూర్వ జన్మ పుణ్యఫలమన్నారు. శ్రీవారి ఆశీస్సులు ఉండడం వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జెఈవో పెద్దజీయర్ స్వామివారి మఠాన్ని సందర్శించారు. అక్కడ స్వామివారి ఆశీర్వచనం పొందారు. తరువాత శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో లో టిటిడి ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో పార్వతి, డెప్యూటీ ఈవోలు హరీందర్ నాథ్ , మల్లీశ్వరి , విజివో మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.