APSRTC: ఎపీ ప్రయాణికులకు శుభవార్త 'ఛలో' యాప్ తో టికెట్ సేవలు
ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఎపీఎస్ఆర్టీసీ సంస్థ శుభవార్త తెలిపింది. అతిత్వరలో మొబైల్ టికెటింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఎపీఎస్ఆర్టీసీ సంస్థ శుభవార్త తెలిపింది. అతిత్వరలో మొబైల్ టికెటింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి ఛలో యాప్ ను విజయవాడలో ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్, ఛలో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వినాయక్ లు బుధవారం ఆవిష్కరించారు. ఇందుకుగాను విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి విశాఖకు కనెక్టివిటీ పెంచే విధంగా 22 వోల్వో బస్సులను కొనుగోలు చేస్తున్నాం అని తెలిపారు. వీటికి డాల్ఫిన్ క్రూయిజ్లుగా నామకరణం చేస్తాం.
యాప్ ద్వారా విజయవాడలో 500 సిటీ బస్సుల్లో 2.5 లక్షల మంది రోజువారీ ప్రయాణికులకు సేవలందించనుంది. ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రయాణికులు టికెట్ లను నేరుగా మొబైల్ ఫోన్ నుంచే కొనుక్కోవచ్చు. ఇందుకు గాను 'ఛలో' అనే ప్రజా రవాణా కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుని 'ఛలో' యాప్, 'ఛలో' కార్డులను ప్రవేశపెట్టింది. తొలి దశలో మొబైల్ టిక్కెటింగ్, 'ఛలో' కార్డులను విజయవాడ సిటీ బస్సుల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ కార్డును మొదటి మూడు నెలలు ప్రయాణికులకు ఉచితంగా అందించేందుకు ఈ కంపెనీ నిర్ణయించింది. ఆ తర్వాత తమ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ చేసుకోవాలి.
అంతే కాక ఈ కార్డుపై అన్ని రీఛార్జ్లపై 5 శాతం ప్రారంభోత్సవ బోనస్ లభిస్తుంది. దీంతో పాటుగానే ఈ స్మార్ట్ కార్డుతో ఒక రోజు బస్ పాస్ను కూడా పొందొచ్చు. ఈ పాస్తో విజయవాడ సిటీ బస్సుల్లో అపరిమితంగా పర్యటించేందుకు వీలు కల్పించారు. అంతేకాకుండా ప్రయాణికుడు కండక్టర్కు ఈ కార్డును చూపిస్తే..కార్డును ఎలక్ట్రానిక్ టిమ్కు ట్యాప్ చేసి టిక్కెట్ ఇస్తారు.
ఇప్పటికే ఆర్టీసీలో ఆన్లైన్ రిజర్వేషన్, ఈ–వాలెట్, నగదు రహిత లావాదేవీలు, వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అమలవుతున్నాయి. ఈ యాప్ ద్వారా సిటీ బస్సుల్లో ఎక్కడ్నుంచి ఎక్కడకు ప్రయాణించాలో నమోదు చేసుకుని డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఛలో యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్తో బస్టాప్ల చిరునామాలు, అన్ని ప్రయాణ మార్గాల ఛార్జీలను తెలుసుకోవచ్చు.