చాలావారకూ ప్రజలు కలెక్టర్లు అందుబాటులో ఉండరని చెప్తుంటారు. ఆ ముద్రను చేరిపేయండి. అంటూ కలెక్టర్లకు పిలుపునిచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అమరావతిలో జగన్ అధ్యక్షతన కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాలనలోని పలు అంశాలపై కూలంకషంగా సీఎం కలెక్టర్లకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా అయన తమ ప్రభుత్వ పనితీరుకు అనుకూలంగా ప్రజలతో ఎలా వ్యవహరించాలనే అంశం పై కలెక్టర్లకు సూచనలు ఇచ్చారు. ప్రజల సమస్యలను వినేందుకు.. పరిష్కరించేందుకు.. ప్రతి సోమవారం స్పందన అని కార్యక్రమాన్ని చేపట్టమని కలెక్టర్లకు సూచించారు.
''ప్రతి సోమవారం కేవలం కలెక్టరేట్లోనే కాదు, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో స్పందన కార్యక్రమం చేపట్టండి. ఆ సోమవారం రోజు ఎలాంటి రివ్యూ సమావేశాలూ చేపట్టొద్దు. సెక్రటరీలు, హెచ్ఓడీలకు కూడా ఇదే చెప్తాం:. నవ్వుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టండి. గ్రీవెన్స్ తీసుకున్న తర్వాత రశీదు ఇవ్వండి, మొబైల్ నంబర్ తీసుకోండి. రశీదు తీసుకున్న తర్వాత టైంలైన్ ఇవ్వండి. మీ సమస్యను, నేను ఈ టైంలోగా పూర్తిచేస్తా అని అందులో మెన్షన్ చేయండి. ఇదే పద్దతి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాలి. నేను కూడా రాబోయే రోజుల్లో గ్రామసచివాలయాలు వచ్చాక... రచ్చబండ నిర్వహిస్తా. ఆ రశీదులను రాండమ్ గా చెక్ చేస్తా. మీ లెవల్లో మీరు కూడా రాండమ్ చెక్చేయండి. నెలకోసారి కచ్చితంగా రాండమ్ చెక్ చేయండి. దీనివల్ల ఆ పని చేయాలనే పరిస్థితి వస్తుంది. రశీదులు ఇచ్చి పట్టించుకోలేదనే పరిస్థితి రాకూడదు. స్పందన కార్యక్రమానికి పూర్తి పబ్లిసిటీ ఇవ్వండి. అంగన్వాడీలు, హోంగార్డులు, ఇతర అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీళ్లే మన గురించి నెగెటివ్గా మాట్లాడితే.. ఇక ప్రజలు కూడా అలాగే మాట్లాడతారు. మన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులను సంతోషంగా ఉంచండి. లేకపోతే.. డెలివరీ నెట్వర్క్ పనిచేయదు. ప్రతి నెలలో మూడో శుక్రవారం దిగువస్థాయి ఉద్యోగులకోసం, మనతో పనిచేస్తున్న ఉద్యోగులకోసం కేటాయించండి.
వారంలో ఒకరోజు హాస్టల్లో , ప్రభుత్వాసుపత్రుల్లో నిద్రించండి
కలెక్టర్లు సహా... జిల్లాలోని ఐఏఎస్ అధికారులు ప్రతి వారంలో ఒకరోజు హాస్టల్లో , ప్రభుత్వాసుపత్రుల్లో నిద్రించండి. మిమ్మల్ని అందర్నీ కోరుతున్నా. ఆకస్మిక పర్యటనలు చేయండి. అరగంట ముందు మీ టీంను పంపండి. ఐఏఎస్లే అక్కడకు వెళ్లి పడుకున్నప్పుడు... అక్కడ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో తెలుస్తుంది. అక్కడ మరుగు దొడ్డిని వాడుతున్నప్పుడు.. అవి సరిగా ఉన్నాయో, లేదో మీకు తెలుస్తుంది. పిల్లకు పుస్తకాలు సరిగా అందుతున్నాయా? లేదా? సరిగ్గా బోధిస్తున్నారా లేదా? తెలుస్తుంది.మీరు సడన్గా వస్తున్నారని తెలిస్తే.. హాస్టళ్లు, పీహెచ్సీలు బాగుపడుతాయి. పొద్దుట లేచిన తర్వాత అక్కడే స్నానం చేయండి. ఆతర్వాత ఆగ్రామ ప్రజలతో సమావేశం అవ్వండి. ఉదయం 10 తర్వాత గ్రామాలకు వెళ్తే... ఎవ్వరూ ఉండరు. పొద్దుటే వెళ్తే.. ప్రజలు ఉంటారు. నవరత్నాలు ఎలా అమలు అవుతున్నాయో ఫీడ్ బ్యాక్ తీసుకోండి. మీరు హాస్టళ్లకోసం, ఆస్పత్రులుకోసం డబ్బులు అడగండి. నేను ఇస్తా. మీరు ఇప్పుడున్న స్కూల్స్ ఫొటోలు తీయండి. రెండేళ్లలో వాటిని మారుస్తాం. ఆతర్వాత 2 ఫొటో గ్రాఫ్లు చూపించండి. విద్య, ఆరోగ్యం, రైతులు నా ప్రధాన ఎజెండా'' అంటూ తమ పాలనలో ప్రజలతో ఎలా మమేకమవ్వాలో సూచించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.