ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్న జగన్ పార్లమెంట్ కార్యాలయానికి వెళ్లి ప్రధానితో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించి తమకు సహకరించాలని ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుమారు 45 నిముషాల కొనసాగింది. సీఎం జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు ఉన్నారు. కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై లోక్సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో భేటీ అనంతరం మోదీ నేరుగా సభకు హాజరయ్యారు. రాష్ట్రాభివృద్ధికి ఆర్థికి సాయం చేయాల్సిందిగా సీఎం జగన్ ప్రధానిని కోరినట్టు తెలిసింది.
రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులు విడుదలపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇక మోదీతో భేటీకి ముందు సౌత్ బ్లాక్లో పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బృందం 40 నిముషాలపాటు సమావేశమైంది. సీఎంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.